Sunday, 17 September 2017

రమణమహర్షి జీవితచరిత

శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -7.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !

అరుణాచలేశునిచే అక్కున చేర్చుకోబడిన  వేంకటరామన్, తరువాత ' అపీతకుచాంబ '  ఆలయాన్ని దర్శించుకున్నాడు.  ' అయ్యంగుల ' కోనేటి వద్దకు వెళ్ళాడు.  దగ్గరవున్న భక్ష్యపొట్లాలు  కోనేటిలోనికి విసిరి వేసాడు.   తన వెనుకటి జీవిత స్మృతులు గుర్తుకోచ్చేవన్నీ దూరంచేసుకునే కార్యక్రమంలో తన ఒత్తైన పొడవాటిజుట్టు కూడా అనవసరం అనుకున్నాడు.   అలాఅనుకుంటూ వుండగానే, ఒక అపరిచితుడు  ఆతనిని ఒకమంగలి యింటివద్దకు చేర్చి అద్రుశ్యుడయ్యాడు.   ఏమి  ఈశ్వరలీలా పరంపర.  అడుగడుగునా వేంకటరామన్ ని చెయ్యిపట్టుకుని నడిపించిన తండ్రి.   శిరోముండనం అనుకున్నంతలో తనప్రమేయం లేకుండానే ముగించుకున్నాడు  వేంకటరామన్.  ఇక కౌపీన వస్త్రధారణ. ఇది బ్రహ్మచర్య వ్రతధారణకు గుర్తు.   తనుకట్టుకున్న వస్త్రాన్నే చింపి, ఒక పేలికను కౌపీనంగా కట్టుకున్నాడు.  మంగలికి ఇవ్వగా మిగిలిన ద్రవ్యాన్ని కూడా అక్కడే పారవైచాడు.   మళ్ళీ జీవితంలో ద్రవ్యాన్ని చేతులతో తాకలేదు.   ఇక మిగిలింది బ్రాహ్మణ సంకేతమైన యజ్ఞోపవీతం.  తన పూర్వజీవితములో తండ్రిగారు ఉపనయనం లో వేసినది.  జగానికే తండ్రి అయిన అరుణాచలపుత్రుడను కనుక నేను కులాలకు అతీతుడను అనుకుని వెంటనే  జంధ్యాన్ని కూడా తీసి పారవేశాడు.

ఇక  మిగిలింది స్నానం .  అదికూడా అనవసరమని వేంకటరామన్ వూరుకున్నాడు.  అయితే తండ్రి నియమలోపం జరుగనివ్వలేదు.  బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు. నీటిధారల మధ్య సన్యాస వ్రతధారణ నిరాటంకంగా పరిసమాప్తమైనది.  ఆశ్చర్యం.  అప్పటిదాకా గ్రామంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బందిపడ్డారు.  చాలారోజుల తరువాత వెంకటరామన్ వచ్చి అక్కడ వర్షం కురిపించాడు తన సన్యాసధారణ కోసం. 

ఆరాత్రి అంతా వేంకటరామన్ ఆలయంలోని వేగాళ్ళమండపం లో చలికి గజగజ వణికిపోతూ కాళ్ళు దగ్గరగా ముడుచుకుని మౌనంగా ధ్యాననిష్టలో కూర్చున్నాడు, కటిక ఉపవాసంతో.  మరునాడు ఉదయం ప్రక్కనే వున్న శ్రీగోపుర సుబ్రహ్మణ్యస్వామి ఆలయం లో వుంటున్న మౌనస్వామి శిష్యునితో ఆ మండపంవద్దకు వచ్చాడు.  అక్కడే పచార్లుచేస్తున్న వేంకటరామన్ ని పరీక్షగాచూచి ఈ కుర్రవానికి ఆహారం తీసుకురమ్మని శిష్యునికి  చెప్పాడు.  వారు తెచ్చుకున్న భిక్షాన్నం లోని కొంతభాగాన్ని ఉప్పుడు బియ్యపు అన్నం పెద్ద పెద్దమెతుకులతో పైన ఉప్పు, అడుగున పుల్లనీళ్ళు, నంచుకునేందుకు ఊరగాయబద్దతో తీసుకువచ్చాడు.  ' అదే ఈశ్వరుడు మనకు పెట్టిన మొదటి భిక్ష ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్ళు తాగాను ' అని తరువాత రోజుల్లో భక్తులతో ఆ సంఘటన తరచూ చెప్పేవారు, రమణులు.

ఆ తరువాత 3 యేండ్లదాకా   వేంకటరామన్ దేవాలయ గర్భగుడికి వెళ్ళలేదు.  హృదయ గర్భంలో తండ్రి పదిలంగా వున్నాడు కదా! 

అక్కడి సాంప్రదాయం ప్రకారం విరాగులు అయిన వారిని ' పరదేశులు ' అంటారు.  మన వేంకటరామన్ కూడా ఆ విధంగా బ్రాహ్మణ పరదేశి అయినాడు.  వేంకటరామన్  జీవితంలో పూర్తిగా మార్పు వచ్చింది. 

మొదటి రోజుల్లో వేగాళ్ళ మండపం మధ్యలో వున్న అరుగుమీద మౌనంగా ధ్యానంలో వుండేవాడు.  అప్పుడప్పుడు లేచి పచార్లు చేసినా మాట్లాడేవాడు కాదు.  ఆహారం గురించి యెవరినీ అడిగే  ప్రసక్తేలేదు తమకు తాముగా యెవరైనా యేదైనా యిస్తే, సమాధిస్థితిలో లేకపొతే తీసుకునేవాడు.  కొత్తప్రదేశం.  ఆదరించేవారు లేరు.  ఏ విధమైన రక్షణలేదు.  అసలు సిసలైన సన్యాస జీవితం.

కొంటె పిల్లలు కొందరు రాళ్ళు, చిల్లపెంకులు వేసి పరదేశి ధ్యానానికి అంతరాయం కలిగించేవారు.  వారి బారినుండి తప్పించుకొనడానికి పరదేశి అక్కడున్న పాతాళలింగ గుహను ప్రవేశించాడు.  అందులోకి వెళ్ళడానికి పిల్లలు భయపడే వారు.  లోపల అంతాచీకటి.  అందులోనికి వెళ్లి పరదేశి ధ్యాననిష్టలో వుండేవాడు.    అక్కడా కీటకాల బాధ, పిల్లల బాధ మొదలైంది.   పరదేశి ధ్యాననిష్టను చూసి, కంచి నుండి వచ్చిన శేషాద్రిస్వామి,  ఆయనను గుహ వెలుపల నుండి జాగ్రత్తగా చూసుకునేవాడు. 

శేషాద్రిస్వామినీ   లెక్కచెయ్యక కొంతమంది తురకబాలురు గుహలోనికి రాళ్ళు వేయుచుండగా, ప్రక్కనుంచి వెళుతున్న వేంకటాచలమొదలియారు వారిని తరిమి, గుహలోనికి వెళ్లి కటికచీకటిలో  శివలింగం వెనుక ధ్యానమగ్నుడైన చిన్నస్వామి ( పరదేశి ) ని చూశాడు.  అక్కడే దగ్గరలో వేగాళ్ళమండపానికి పశ్చిమంగా వున్న తోటలో పళనిస్వామి  అనే ఆయన తన శిష్యులతో వుండేవాడు.  వారిని సహాయం పిలిచి అక్కడి నుంచి పరదేశిని బైటకు తీసుకువద్దామని ప్రయత్నించినా దేహస్మృతి కలగలేదు చిన్నస్వామికి.  వారు యేమీ చెయ్యలేక ధ్యానభంగం చెయ్యడం యిష్టంలేక ఆయనకు మ్రొక్కి వెళ్లిపోయారు.    చిన్నస్వామి ని అప్పటి నుంచి ' బ్రాహ్మణస్వామి ' అని పిలవడం మొదలుపెట్టారు.  అలా  'పరదేశి' పేరు నుండి ' స్వామి' అయ్యాడు మన వెంకటరామన్.   

స్వస్తి.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరి కొన్ని విషయాలు రేపు....
ప్రేమతో,
ప్రభాకర్.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...