శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -6.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
అతుల్యనాధేశ్వరుని కోవెల వెలుపల వెంకటరామన్ కూర్చున్నాడు, పూజారికై యెదురుచూస్తూ..
కొంతసేపటికి పూజారివచ్చి పూజ ప్రారంభించాడు. వేంకటరామన్ లోపలికివెళ్లి మండపం దగ్గర కూర్చుని ధ్యానం మొదలుపెట్టాడు. ఉన్నట్లుంది ఏదో గొప్ప వెలుతురు తనదేహాన్ని కప్పినట్లుగా అనిపించసాగింది. కళ్ళు తెరచి నాలుగుడుగులు వేస్తే ఇంకెక్కడా ఆ వెలుగు కనిపించలేదు. వెంటనే యధాస్థానానికి వచ్చి ద్య్హానంలో నిమగ్నుడైనాడు వేంకటరామన్. ఇక్కడ చెప్పుకో వలసిన అద్భుతమైన విషయం యేమిటంటే యిదే ప్రదేశంలో 16 సం. వయస్సులోనే జ్ఞానసంబంధమూర్తి అనబడే గొప్ప శివభక్తునికి కూడా యిక్కడే జ్యోతి దర్శనం అయ్యింది. ఓం శ్రీ అతుల్యనాధేశ్వరాయనమ :
పూజారి పూజ ముగించుకుని వేంకటరామన్ని లేపి గుడితలుపులు మూసి వేరేగుడికి పూజ చెయ్యడానికి వెళ్ళాడు. వేంకటరామన్ కూడా ఆయనను అనుసరించి అక్కడా పూజ జరుగుతున్నంత సేపు ధ్యానంలో వుండిపోయాడు. మళ్ళీ పూజారి అతనినిలేపాడు. ఆకలి అవుతున్నది ప్రసాదం పెట్టమని వేంకటరామన్ పదేపదే అడిగినా కఠినహృదయుడైన పూజారి, ప్రసాదం అతనికి యివ్వలేదు. అతని పరస్థితి చూసి, అక్కడి నాదస్వరబృందంలో వాద్యగాళ్ళలో ఒకరి మనసు కరిగి తనప్రసాదం అతనికి ఇచ్చివేశాడు. తరువాతి కాలంలో ఆపూజారి యెంత వగచాడో, ఆ వాద్యగాడు యెంత మురిశాడో, రమణునికి ప్రసాదం పెట్టనందుకు, రమణునికి ప్రసాదం పంచినందుకు.
ఆప్రసాదం తీసుకుని కొండదిగి ఒక యింటిముందు ఆగి నీరు యివ్వమని అడిగాడు వేంకటరామన్. అంతలో యేమయ్యిందో తెలీదు. శరీరం వశంతప్పింది. బాహ్యస్మృతి పోయింది. మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికి కొంత దూరంలో పడి వున్నాడు. ప్రసాదం చెల్లాచెదురు అయివుంది. చుట్టూ జనం మూగి వున్నారు. క్రింద పడిన ప్రసాదాన్నే కొంచెం తిని నీరుత్రాగాడు. ఆ రాత్రి అక్కడే ఇసుకమీద నిద్రపోయాడు వేంకటరామన్.
మర్నాడు గోకులాష్టమి. 1896 ఆగష్టు 31వ తేదీ. వెంకటరామన్, పూర్తిగా అలిసిపోయి వున్నాడు. తిరువన్నామలై ఇంకా 20 మైళ్ళ దూరం వున్నది. చేతిలో చిల్లిగవ్వ లేదు. చెవులకి వున్న కెంపుల పోగులు తప్ప వంటిమీద ఖరీదైన వస్తువులు కూడా లేవు. కడుపు ఆకలితో మండిపోతోంది. ఒక బ్రాహ్మణ వీధిలో ముత్తుకృష్ణ భాగవతార్ అనే ఆయన యింటిముందు ఆగి భోజనం పెట్టమని అడిగాడు. ఆయన సోదరి, జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడే తమ యింటికివచ్చాడని భావించి వంటచెయ్యడం మొదలుపెట్టింది. వేంకటరామన్ పరిస్థితి చూసి, వంట అయ్యేవరకు వుండలేడని భావించి ముందురోజు మిగిలిన చలిది అన్నం తినిపించింది. వంట పూర్తిఅయిన తరువాత పిండివంటలతో భోజనంపెట్టి, శ్రీకృష్ణునికి నైవేద్యం పెట్టడం కూడా మర్చిపోయి, వేంకటరామన్ కు రాత్రి భోజనానికి మూట కట్టి ఇచ్చింది. ఆమె చేసుకున్న సుకృతం మాటలలో వర్ణించగలమా! ఆమె సేవకు వెలగట్టగలమా!!
మిగిలిన ప్రయాణానికి తన కెంపుల చెవి కమ్మలు 4 రూ. లకు ఆ ఇంటి భాగవతారు వద్ద తాకట్టుపెట్టి ఆయన యిచ్చిన తాకట్టు చీటీని ఆయింటిబయటే చించివేశాడు, వున్న ఆఒక్క బంధాన్నీ వదిలించు కున్నట్లుగా.
ఆమె ఇచ్చిన మూట తీసుకుని రైలులో అరుణాచలానికి బయలుదేరి 1896 సెప్టెంబరు 1వ తేదీ నాడు అరుణాచలంలో అడుగుబెట్టాడు వెంకటరామన్.
అడుగుపెట్టీ పెట్టగానే, వేంకటరామన్ అపరిమితమైన ఆనందంతో వూగిపోతున్నాడు. వెంటనే అరుణా చలేశుని ఆలయానికి పరిగెత్తాడు. బిడ్డకోసం యెదురుచూస్తున్నట్లుగా ఆ అరుణాచలేశ్వరుని గుడి ద్వారాలన్నీ తెరిచేవున్నాయి, గర్భగుడితో సహా.
వేంకటరామన్ దివ్యావేశంతో గర్భగుడిలోనికి ప్రవేశించి తండ్రిని చేరుకున్నాడు. ఉబికివస్తున్న ఆనంద బాష్పాలతో అరుణాచలేశ్వరుని అభిషేకిస్తూ " తండ్రీ నీ ఆజ్ఞమేరకు వచ్చాను." అని విన్నవించుకున్నాడు. ఆహా ! ఏమిదృశ్యము. ఆతండ్రి యీబిడ్డకు ఏమి మౌనోపదేశం చేశాడో తెలియదు. అంతవరకూ వేంకటరామన్ అనుభవిస్తున్న అశాంతి అనేమంట చల్లారిపోయింది అమృతం చిలకరించినట్లయ్యింది. వేంకటరామన్ మామూలుభక్తులలా చేతులెత్తి నమస్కరించలేదు. గుడికి ప్రదక్షిణాలు చెయ్యలేదు. సాష్టాంగపడి మ్రొక్కలేదు. మామూలుగా తండ్రికి బిడ్డ యివన్నీ చెయ్యవలసిన అవసరం లేదుకదా! బిడ్డ తండ్రిని ప్రేమతో కౌగలించుకున్నట్లు అరుణాచలేశుని పెనవేసుకున్నాడు, యింక నీవేదిక్కని. రేపటి గురించి చింతలేని పరిపూర్ణ శరణాగతి ! యెంత మనోహర దృశ్యం !!
స్వస్తి.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరి కొన్ని విషయాలు రేపు....
ప్రేమతో,
ప్రభాకర్.
No comments:
Post a Comment