శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -1.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
శ్రీ రమణుల ముత్తాతల కాలంలో ఒకసన్యాసి భిక్షకోసం రమణుల పూర్వీకుల యింటికి వచ్చాడు. వారి ముత్తాత చిరాగ్గా ఆ భిక్షకుని చూస్తూ " దున్నపోతులా వున్నావు. ఏదైనా పనిచేసుకోరాదా? " అని కేకలు వేశాడు. అయితే ఆ సన్యాసి కూడా అంతే కోపంతో " నీ వంశములో కూడా నాలాగే తరానికి వకరు సన్యాసియై యింటింటికీ వెళ్లి అడుక్కుందురు గాక! " అని శపించాడు. అప్పుడు ముత్తాత గారు ఆ భిక్షుకునికి నమస్కరించి " ఏమిటి ఈ విపరీత భావన. కనికరించండి " అని అడుగగా " మాకోపం తాటాకుమంట లాంటిది. కానీ మావాక్కు తిరుగులేనిది. అంతా మంచే జరుగుతుంది " అని వెళ్ళిపోయాడు.
అన్నట్లుగానే, మూడుతరాలు ఆశాపం కార్యరూపం దాల్చింది. భగవాన్ రమణుల తాతలలో వొకరు సన్యాసం స్వీకరించారు. ఆయనపేరు శివానందయోగి. రెండోతరంలో భగవాన్ పెదతండ్రి వెంకటేశ్వర్ 18 సం. లకే ప్రాపంచిక సుఖాలపై విరక్తుడయ్యాడు. తరువాత తరంలో మన రమణులు కూడా 16 సం.ల వయస్సులోనే యిల్లువదలి అరుణాచలం వెళ్ళిపోయారు.
ఆహా ! మహాత్ముల శాపాలు మానవ కల్యాణం కోసమే కదా! ఆ శాపమే, మానవాళికి రమణమహర్షి ద్వారా జీవిత సత్యాలని చెప్పి పునీతులని చేసింది. ఎందరినో ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపిస్తున్నది.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరికొంత రేపు....
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -2.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
అది 1879 డిసెంబరు, 29వ తేదీ. అర్ధరాత్రి దాటింది. ఇంగ్లీషు లెక్కల ప్రకారం 30 వ తేదీ వచ్చింది. ఒంటిగంట సమయం. ఆరోజు హిందువులకు పర్వదినం అయిన ఆరుద్రా దర్శనోత్సవం.
ప్రదేశం : తమిళనాడులో మదురై దగ్గర తిరుచ్చుళి గ్రామం. ఈ గ్రామమే ' త్రిశూలపురం ' అని స్కాందపురాణం లో పేర్కొనబడింది. ఆగ్రామంలో శ్రీ భూమినాధేశ్వరుని ఆలయంలో ఈశాన్యం వేపు వున్న ఓ ఇల్లు.
ఆ యింటిలో శ్రీ సుందరఅయ్యర్ గారి భార్య అళగమ్మ ఉదయం నుండి పురిటినొప్పులు పడుతున్నది. ఆమెకు బాసటగా ఆమె అత్తగారు, పొరుగింటి అంధస్త్రీ లక్ష్మీఅమ్మాళ్, మరికొందరు స్త్రీలు వున్నారు. అప్పుడే పునర్వసు నక్షత్రంతో చంద్రుడుకూడి కాంతులు వెదజల్లుతున్నాడు. శ్రీ భూమినాదేశ్వరుడు గ్రామం అంతా ఊరేగి, తన ఊరేగింపు ముగించుకుని ఆలయానికి చేరబోతూ, ఒక్క క్షణం ఆయింటి ముందు ఆగాడు. సరిగ్గా ఆసమయం లోనే, ఉదయం నుండి నొప్పులు పడుతున్న అళగమ్మ పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఆ భూమినాధేశ్వరుడు, తన ఊరేగింపు ముగించుకుని వచ్చి తన చల్లని దృష్టి ప్రసరింప చేయడం కోసమే, ఆమె ప్రసవం ఆగినట్లున్నది.
మనుమడు పుట్టినందుకు ఆమె అత్తగారు సంతోషింపక పోగా, తన కుమార్తెకుమారుడికి ఆడపిల్లని యిచ్చి మేనరికం చెయ్యలేక పోతున్నామే అని బాధపడింది. అయితే, ప్రక్కనే వున్న అంధమహిళ " మగబిడ్డ బంగారుముద్ద లాగా వెలిగిపోతున్నాడు. కాంతిపుంజంతో అవతారమూర్తి లాగా వున్నాడు. ఎందుకు ఏడుస్తావు. " అని వోదార్చింది. ఆశ్చర్యం. ఆ అంధురాలు, లక్ష్మీఅమ్మాళ్ కి యెలా ఆ కాంతిపుంజం దర్శనం అయింది. బాలుని రూపురేఖలు యెలా కనబడ్డాయి? తరువాత రోజుల్లో అజ్ఞాన అంధకారంలో నుంచి మనుష్యుల జీవితాలను వెలుగులోనికి తీసుకువచ్చే మహనీయుడు జన్మించాడని సంకేతమా? అంతే అయివుంటుంది. ఎందుకంటె, ఆ బాలుడే, ' భగవాన్ శ్రీ రమణమహర్షి ' నామంతో కలియుగ కుమార స్వామిగా ఆరాధింప బడినవాడే కదా!
సుందరఅయ్యరు గారు ఆబాలునికి తమ కులదైవమైన వేంకటేశ్వరుని పేరుపెట్టారు. కానీ, వేంకటేశ్వరుడు బడిలో ప్రవేశించిన తరువాత ' వెంకటరామన్ ' గా మారాడు. లక్ష్మణ్ అయ్యర్ అనే తెలుగు పండితుడు
' రమణుడు ' అనీ ' రమణీ ' అని ముద్దుగా పిలిచేవాడు. అదే కాలక్రమేణ స్థిరపడింది. ఆయన తెలుగు సాంప్రదాయాన్ని రమణుడికి అలవాటు చేశాడు. ఆ విధంగా రమణుడి ఎలిమెంటరీ విద్యాభ్యాసం జరుగుతుండగా, 8 సం. వయస్సులో ఆ బాలునికి తండ్రి శాస్త్రోక్తంగా ఉపనయనం చేశాడు.
స్వస్తి.
శ్రీ రమణమహర్షి జీవితచరిత్ర లో కొన్ని ముఖ్యఘట్టాలు -3.
ఓం నమో భగవతే శ్రీరమణాయ !
రమణుడికి ఆంగ్లభాష నేర్పాలని తండ్రి సుందరం అయ్యరు కోరిక. అయితే తిరుచ్చుళి లో అలాంటి బడి లేక పోవడంతో 1891 లో మన వెంకటరామనుని దిండిగల్లులో వున్న తన పెద్దతమ్ముడు సుబ్బయ్యరు వద్దకు పంపాడు. అప్పటికే రమణుని అన్నగారు నాగస్వామి అక్కడే చదువుకుంటున్నాడు. రమణుడు మొదటిఫారంలో చేరాడు. రమణుడు ఏకసంధాగ్రాహి. అయితే చదువుపట్ల పెద్దఆసక్తి కనబరచేవాడు కాదు. విన్నదివిన్నట్లుగా వప్పగించేవాడు. కానీ శ్రద్ధలేదు. నిద్రలో అపరకుంభకర్ణునిలా వుండేవాడు. ఆ నిద్ర మొద్దునిద్రగా భావించలేము. అది రాబోయేకాలంలో కఠొరమైన ఆత్మానుభవానికి నాందిగా అనుకోవచ్చు. కొద్దిరోజుల్లోనే సుబ్బయ్యరు గారు దిండిగల్లు నుండి మధురకు మారారు. పినతండ్రి, అన్నగారితో పాటు మన వేంకటరామన్ కూడా మదురై చేరారు. అక్కడవున్న స్కాట్ మిడిల్ స్కూల్ లో రెండవ ఫారంలో చేరాడు.
కాలం మార్పులను తెస్తుందికదా! సుందరం అయ్యరు మధ్యవయస్కులుగా వుండగానే, అనగా 48వ యేటనే అనారోగ్యానికి గురి అయ్యి మరణించారు. ఆయన చనిపోయే నాటికి నలుగురుసంతానంలో పెద్దవాడు నాగస్వామికి 16 సం. రెండవవాడు వెంకటరామన్ కి 12 సం. మూడవవాడు నాగాసుందరానికి 6 ఏళ్ళు. ఆఖరిదైన ఆడపిల్ల అలువేలుమంగ యింకా పోత్తిళ్లలోనే వున్నది. అట్టిపరిస్థితులలో సుబ్బయ్యరు గారు అన్నగారి మొదటి యిద్దరుపిల్లలని మదురై లో వుంచుకుని తన భ్రాతృప్రేమ చాటుకున్నాడు. అదేవిధంగా మిగిలిన యిద్దరుపిల్లల భారం రెండవతమ్ముడు నెల్లియప్పయ్యర్ వహించాడు. అవీ ఆరోజుల్లో కటుంబవిలువలు. అన్నదమ్ములు కుటుంబ బాధ్యతలను తలకెత్తుకునె తీరు. ఈరోజులలో వూహకుకూడా అందనివి.
ఇంతజరిగినా, తండ్రిమరణం గానీ కుటుంబమార్పులు కానీ వెంకటరామన్ పై యేప్రభావం చూపలేదు. జీవితాన్ని ఉదాసీనంగా గడుపుతున్నాడు. అమెరికన్ మిడిల్ స్కూల్లో 4వ ఫారం లో చేరాడు. అయితే చదువునందు మాత్రం పెద్ద శ్రద్ధ కనబరచుట లేదు. ఆంగ్లము, గణితము అసలే పట్టలేదు. తమిళ వ్యాకరణం తమిళ శ్లోకాలు మాత్రం వింటే మర్చిపోయేవాడు కాదు. స్వతహాగా తెలివిగలవాడు అవడం వలన ఆసక్తి చూపకపోయినా అన్నిపరీక్షలలో ఉత్తీర్ణుడయ్యేవాడు.
వేంకటరామన్ మంచి కండపుష్టి కలవాడు. ఈ దారుధ్యమే తనకు దీర్ఘకాలం మౌననిష్టలో కూర్చునేందుకు దోహదపడింది అనిపిస్తుంది. అతని కండబలం చూసి అందరూ ముచ్చటపడేవారు. ఆటలపట్ల ఆసక్తి చూపించేవాడు. ఫుట్బాలుఆటలో మేటిగా వుండేవాడు. ప్రతీరోజు వైఖానదిలో స్నేహితులతో కలిసి ఈతలు కొట్టేవాడు. ఎండాకాలం తనూ, స్నేహితులతో కలిసి చెలమలు తవ్వి, వారు స్నానమాడి, గ్రామస్తులకు నీటి కొరత తీర్చేవారు. పినతల్లికి వంటలో, ఇంటిపనుల్లో సాయం చేసేవాడు. ఆమెకి మడీ ఆచారం ఎక్కువ కావడంతో తడిగోచీతో వంటింట్లోకి రమ్మంటే యిష్ట పడేవాడు కాదు.
ఆహా! కాలమహిమ. అట్టి తడిగోచీ ఇష్టపడని వేంకటరామన్ భవిష్యత్తులో శాశ్వతంగా గోచీ ( కౌపీనం ) తోనే జీవితం గడిపి యితరులకు వైరాగ్యమార్గం చూపించాడు.
స్వస్తి.
శ్రీ రమణుల ఆశీస్సులతో మరి కొన్ని విషయాలు రేపు....
ప్రేమతో,
ప్రభాకర్.
No comments:
Post a Comment