Saturday, 5 May 2018

ధ్యానం చేయాలనుకుంటే

ధ్యానం..ఒక..ప్రయాణం..!!💐శ్రీ💐

నీలో నాలో మనలో ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆత్మస్వరూపమే పరమాత్మ.ఈ సృష్టిని నడిపించే అనంతమైన శక్తి ఆ పరమాత్మ. ఆసత్యాన్ని అవగతం చేసుకొని ఆయనను చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే ధ్యానం. ఆ ధ్యానం"యోగ" లో
భాగం.

ధ్యానం అంటే ఎవరి మనసులోకి వారు చేసే ప్రయాణం. ఆప్రయాణం ఎందుకో, ఎలాచేయాలో తెలుసుకున్నవారు మానసికంగానూ శారీరకంగాను ధృఢంగా ఉండగలరు.

అతి చిన్న విత్తనం నుంచే అంత పెద్ద మర్రిచెట్టు పుట్టిందన్న సత్యం అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం ప్రయాణం చేయాలి. ఆప్రయాణం ఎక్కడికో కాదు, మన(సు)లోకే..అలా ప్రయాణం చేయడానికి కావలసింది ఏకాగ్రత, నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆమూడూ కావాలంటే ధ్యానం చేయడమే సరైనమార్గం.

ధ్యానానికి, యోగినికి సాక్షాత్తూ ఆపరమశివుడే ఆది పురుషుడు. ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు, మహర్షుల నుంచి మహాయోగుల వరకు, ప్రతి ఒక్కరూ ధ్యానం(తపస్సు)లో తరించినవారే. మనమందరం ధ్యానించేది  ఆ దేవుళ్ళనే కదా, మరి ఆదేవుళ్ళు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. నిజమే మరి! దేవతలకన్నా బలమైన మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది.ఆశక్తే మనస్సు. మనస్సు బలంగా ఉన్నప్పుడే ఏపనైనా చేయగలం.

ప్రపంచ గమనం వేగంగా మారింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏ పనీ సంపూర్తిగా, ఏకాగ్రతతో చేయలేని పరిస్థితి. ఏదో సాధించాలనే తపన,ఎక్కడికో వెళ్ళలన్న హడావుడి, ఏదో చేసేయాలన్న ఆత్రుత, తలపెట్టినపని సవ్యంగా జరుగుతుందో లేదోనన్న ఆంధోళన..ఫలితంగా రక్తపోటు, మధుమేహం, కీళ్ళనొప్పులు, వాతం వంటి రుగ్మతలు కమ్ముకొస్తాయి.

దానికి తోడు నిర్వేదం, నిరాశ, మానసిక ఒత్తిడి ముప్పెట దాడిచేసి మనిషిని మరింతగా కుంగదీస్తాయి. ఈదౌర్భల్యం మనస్సును అంటకుండా ఉండడానికే యోగులు, ఋషులు ధ్యానం చేసేవారు. ఈసత్యాన్ని తెలుసుకున్న ఆధునికులు కూడ ఇప్పుడు యోగ, ధ్యానం చేయడం అలవరచుకున్నారు.

ప్రతీరోజూ క్రమం తప్పకుండా యోగా సాధన చేసేవారు శరీరాన్నేకాదు, మనస్సును కూడ అదుపులోకి తెచ్చుకోగలుగుతారు. యోగా సాధనవల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది, చేసే పనిపై ఇష్టం ఆసక్తి పెరుగుతాయి, శరీరం బరువు తగ్గి చురుకుదనం ఏర్పడుతుంది. శారీరక రుగ్మతలు ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, కీళ్ళనొప్పుల వంటివి దరిచేరవు. వైద్యశాస్త్రానికి కూడ అంతు పట్టని కొన్ని సమస్యలకు యోగా, ధ్యానం పరిష్కారం చూపుతున్నాయి.

మనం ఏపని చేయాలన్నా మనస్సు సహకరించనిదే చేయలేము. మనస్సును అదుపు చెయ్యడానికి, మనస్సును జయించడానికి ముఖ్యమైన సాధనం ధ్యానం.
నీరు ఏపాత్రలో వుంచితే ఆపాత్ర ఆకారం పొందుతుంది. మనస్సుకూడ ఏవస్తువుపై లగ్నమైతే ఆవస్తువు స్వరూపాన్ని సంతరించుకుంటుంది. దివ్యత్వాన్ని ధ్యానించే మనస్సు నిర్విరామ భక్తిభావంతో దానినే ధారణ చేస్తుంది.

అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో విద్యుద్దీపంలో తీగ వెలిగినట్లే, ధ్యానంతో యోగి మనసు తేజోమయం అవుతుంది. ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో యోగి దేహం, శ్వాస ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం సమీకకతమై విలీనమవుతాయి. అప్పుడే అనిర్వచనీయమైన చైతన్యానుభూతిని ఆస్వాదిస్తాడు.

ధ్యానస్తితిలో ధ్యానం చేయడం, ధ్యానం చేసే వ్యక్తి, ధ్యాన వస్తువు వుంటాయి. ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానం చేస్తున్నాను అనే భావనపోతుంది.‌ధ్యాన వస్తువు, ధ్యానంచేసే వ్యక్తి‌ మిగులుతారు. ధ్యానం తీవ్రమైన కొద్దీ ధ్యానవస్తువు కూడా లయమైపోతుంది. ధ్యానం చేసేవ్యక్తి మాత్రమే మిగులుతాడు.నేను ధ్యానం చేస్తున్నాను అనేది పోతే తప్ప సమాధిస్థితి ఉచ్ఛస్థితికి చేరదు.

ఆ అహంకారం "నేను" గా చివరి వరకూ వుంటుంది. ఎవరికైతే "నేను" కూడా లయమైపోతుందో, అప్పుడు కేవలం ఆత్మ మాత్రమే స్వయం ప్రకాశంగా మిగులుతుంది.
అదే నిజమైన సమాధి, కైవల్యం.

No comments:

Post a Comment

బ్రహ్మ సత్యం - జగన్మిథ్య

*బ్రహ్మ సత్యం - జగన్మిథ్య* _-{అద్వైత సిద్ధాంతము- ఒక వైఙ్ఞానిక పరిశీలన }-_ _【సమాచారం పెద్దదైనా, సమయం వీలు చేసుకొని చదవాలి】_ _అద్వైత తత్వాన...